Sunday, April 5, 2009

ఎన్నికలొచ్చాయి

ఎన్నికల జాతర మళ్ళీ మొదలయ్యింది. పగటి వేషగాళ్ళు, గారడీగాళ్ళు, మాటల పోటుగాళ్ళు జాతరను రక్తి కట్టిస్తున్నారు. హామీలు, వాగ్దానాలతో ఓటరు దేవుణ్ణి స్తుతించి మద్యం, డబ్బులతో అతన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి తగిన నాయకుణ్ణి ఎన్నుకోవటమనే ప్రక్రియ జోరందుకుంటున్నది. ఈ టపాలో కేవలం నా అభిప్రాయాలను మాత్రం పంచుకుంటున్నాను.

నాయకుడనే వాడు తన జాతికి దిశా నిర్దేశం చేస్తూ, శతాబ్దాల పాటు దేశానికి మంచి జరిగేలా ప్రణాళికలను రచించి అమలుపర్చేవాడై ఉండాలనేది నా అభిప్రాయం. ఇప్పటి రాజకీయులలో అలాంటి నాయకులు ఉన్నారనే నమ్మకం నాకు లేదు. యువతరం నాయకులు కూడా దొందు దొందేననిపిస్తున్నారు. ప్రజలను మభ్య పెట్టడంలో పెద్దవారికన్నా రెండాకులు ఎక్కువే చదివారు. వీరందరి తీరు చూస్తుంటే కేవలం ఈ ఎన్నికలు గట్టేక్కితే చాలాన్నట్లున్నది. ఎంతసేపూ అది ఉచితం, ఇది ఉచితం , ఊరకే డబ్బులిస్తామనేవారేగానీ దేశాన్నిగానీ, రాష్ట్రాన్నిగానీ ఎలా అభివృద్ధి పథంలో నడిపిస్తారో ఎవరూ చెప్పటం లేదు. వీరు ఉచితంగా ఇచ్చే వరాల మీద ఆధారపడి లేని నా ఓటును వారికే ఎందుకివ్వాలో ఏ నాయకుడూ చెప్పటం లేదు. సామాజిక న్యాయం, పేద ప్రజలను ఉద్దరిస్తామనే వాదనకు నా వద్ద విలువ లేదు. ఎవరికివారు తమ స్థితి మెరుగుకావటానికి కష్టపడి ప్రయత్నించాలి. దానికి సమాజంలో అందరికీ సమాన అవకాశం ఉండేలా పరిపాలన ఉండాలి. అంతేగానీ అన్నీ పళ్ళెంలో పెట్టి అందిస్తామని పార్టీలు చెప్పటం తగదు. పోనీ ఆ వాగ్దానాలను ఎలా నెరవేరుస్తారో, అందుకు వనరులు ఎక్కడ ఉన్నాయో ఎవరూ చూపటం లేదు, చెప్పటం లేదు. ఇలాంటి నాయకమన్యులే తప్ప నిజమైన నాయకులెవరూ ఇప్పటివరకూ రంగంలో రాకపోవటం చాలా నిరాశ కలిగిస్తున్నది.

బరిలో ఉన్న అభ్యర్థులందరినీ నిరాకరించే వీలున్నప్పుడే ఓటు వేయాలనే అభిప్రాయాన్ని మార్చుకుని ఈ సారి ఓటు వేయడానికి నిర్ణయించుకున్నాను. అందుకు కారణం ఇక్కడ ప్రజాతంత్రం ఎలా పనిచేస్తుందో, అందులో ప్రజల పాత్రేమిటో చూసాను. భారతదేశంలో ఉన్నది అచ్చమైన ప్రజాస్వామ్యనే భ్రమ తొలిగిపోయింది. ప్రజాస్వామ్యమనేది ఒక పరిణితి చెందిన సమాజం అనుసరించే పరిపాలనా విధానం. అలా పరిణితి సంతరించుకోని దేశాలు ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వపు పోకడలతోనో, రాచరికపు హంగులతోనో, మంద బలంతోనో అనుసరిస్తాయి. మన దేశంలో నడుస్తున్నది అలాంటి పరిపాలన వ్యవస్థే. ఇందులో ప్రజల పాత్ర కేవలం ఓటు వేయటం వరకే పరిమితం. తర్వాత పరిపాలనా వ్యవహారాలలో ప్రజలది కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే. కనీసం ఆ పరిమిత పాత్రనైనా పోషించటానికి ఈ సారి ఓటు వేద్దామని నిర్ణయించుకున్నా.

ఇక నా ఓటు ఎవరికి అన్న విషయంలో 35% ఆ పార్టీ సిద్ధాంతాలు, ప్రణాళికలు పాత్ర వహిస్తే, 50% అభ్యర్థి గత చరిత్ర, ఇంతకు ముందు అతని పనితనం ప్రభావం చూపిస్తాయి. ఒకవేళ అభ్యర్థి కొత్తవాడైయుంటే అతను తన నియోజకవర్గానికి ఎలాంటి సేవ చేయబోతున్నాడో, దానికి ఎలాంటి పద్ధతులు అవలంబిస్తాడన్న విషయంపై ఆధార పడుతుంది. ఇక మిగిలిన 15% అతని వ్యకిగత జీవితం, అతని విద్యార్హతలు, అతని మాట, పని తీరుపై ఆధార పడతాయి. ఇంకా ఏమైనా విషయాలు మర్చిపోయుంటే గుర్తు చేయండి. అలా నా ఓటు తీసుకునే అభ్యర్థి కనీసం పాసు మార్కులు (35%) పొందినవాడై ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ శెలవు తీసుకుంటున్నాను.

2 comments:

  1. ఓటర్లకు చాక్లెట్లు ఇచ్చి కేకు మొత్తం కొట్టేసే నాయకుల కాలం ఇది.

    ఏం చేస్తాం అనుభవించాలి.

    ReplyDelete
  2. bonagiriగారికి,
    మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    ReplyDelete

మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియపరచండి.