Wednesday, February 18, 2009

భారతీయ రైల్వేవారి భారత దర్శనం

మొన్నటి ఆదివారం ఈనాడులో పేదవారి ప్యాలెస్ ఆన్ వీల్స్ అని, కేవలం పది రోజుల్లో ఐదు వేలకే (అన్ని ఖర్చులు కలిపి) పది రాష్ట్రాలను సందర్శించవచ్చని చెపితే చూద్దామని రైల్వే టూరిజంవారి websiteకు వెళ్ళాను. ఒక్క రైలు తప్పించి అన్ని రైళ్ళు ఉత్తర భారతం నుండి ప్రారంభం అవుతున్నాయి. ఇక దక్షిణ భారతంలో మదురై నుండి బయలుదేరే రైలు వివరాలు ఇలా ఉన్నాయి. 15 రోజుల యాత్రకు 7,732 రూపాయలు టికెట్టు ధర. రైలు కేరళ, తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు, హైదరాబాదు, హరిద్వార్, వారణాసి, కోల్కతా, పూరి, కోణార్కు, భువనేశ్వర్ల మీదుగా తిరిగి మదురై చేరుకుంటుందని వివరాలు ఉన్నాయి. ఇక రైలు ప్రయాణ వేళాపట్టిక చూద్దామని ఈ లంకె నొక్కాను.

పట్టిక చూసాక నాకర్థమైంది ఇదీ. మదురైనుండి బయలుదేరిన రైలు రెండున్నర రోజులపాటు తిరువనంతపురంతో పాటు కేరళలోని అన్ని పర్యాటక ప్రదేశాలమీదుగా, తమిళనాడులో తిరిగి ప్రవేశించి హైదరాబాదు చేరుకుంటుంది. మధ్యలో ఎక్కడా పట్టుమని పదిహేను నిముషాలు కూడా ఆగదు. కేవలం ప్రయాణికులను ఎక్కించుకుంటుంది కాబోలు. హైదరాబాదులో బసతో నిజంగా టూరు ప్రారంభమవుతుంది. వెనుదిరిగేటప్పుడు భువనేశ్వర్ తో అంతం అవుతుంది. తిరిగి 2 రోజులు ప్రయాణికులను వారి వారి ఊళ్ళలో దించటానికి సరిపోతుంది. అంటే మొత్తం 15 రోజులలో 4 రోజులు కేవలం రైలులో ప్రయాణానికే సరిపోతాయి. అంటే పత్రికల్లో ప్రకటించినట్లు రోజుకు 500 కాదు 700 ఖర్చవుతాయి. మొత్తం మీద 2000 అదనపు ఖర్చు. కేవలం ప్రయాణికులను ఎక్కించుకోవటానికి 5 - 10 నిమిషాలు ఆగే ఊళ్ళ పేర్లను కూడా సందర్శించే ప్రదేశాల పేర్లతో కలిపేయటం ప్రజలను తప్పు దారి పట్టించటం కాదా? ఇంకో విశేషమేమిటంటే రైలు రూటులో చెన్నై పేరుందిగానీ వేళాపట్టిలో చెన్నై పేరే కనిపించదు. బహుశ చెన్నైను రైలు దిగకుండానే చూపిస్తారనుకుంటా.  పనిలో పనిగా తిరుపతి వెంకన్నను కూడా రైల్లోనుండే చూపించేస్తే ఓ పనైపోయేది.

4 comments:

  1. మీరు ప్రయాణపు రూటు మాత్రమే చూసారు.. ఇక ప్రయాణం లో పదనిసలు ఇంకెన్ని ఉంటాయో కదా.... :(

    ReplyDelete
  2. నేను కూడా పేపరులో ఈ వార్త చూసి అహా ఎంత మంచి అవకాశం అనుకున్నాను! ఇదా దీని వెనుక కథ.

    చెన్నైను రైలు దిగకుండానే చూపిస్తారనుకుంటా:)

    ReplyDelete
  3. @ వీరా రెడ్డి మెట్టుగారికి,
    ఇంతకీ ఏం test చేసారు సార్?
    @ ఉమాశంకర్ గారికి,
    మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.నిజమేనండి. ప్రకటనలకు, అందే సేవలకు పొంతన లేకుండాపోతోంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి.
    @ సిరిసిరిమువ్వగారికి,
    మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ముందు నేను కూడా పత్రికలో చదివి, బాగుందనిపించి బుకింగు చేయడానికి websiteకు వెళితే ఇలా అయ్యింది. ప్రభుత్వరంగ సంస్థల్లో సైతం సేవాదృక్పథం కొరవడుతోంది. ఏం చేస్తాం చెప్పండి.

    ReplyDelete

మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియపరచండి.