Sunday, May 4, 2008

తిండిపోతు మధ్యతరగతి భారతం

నిన్నబుష్షయ్యగారు చేసిన వ్యాఖ్య బాధనిపించి ఈ టపా వ్రాస్తున్నాను. ప్రపంచ ఆహార సమస్యకు భారతదేశపు మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా తినటమే అని బుష్ గారు శెలవిచ్చారు. ఎవరికెలా అనిపించినా నాకు మాత్రం అధ్యక్ష ఎన్నికకు పన్నిన కుతంత్రం అనిపించింది.

అమేరికా డాలరు విలువ పడిపోవటం వల్ల ఆ దేశ సగటు పౌరుడి కొనుగోలు శక్తి తగ్గింది. మరో వైపు భారత్, చైనాలాంటి దేశప్రజలు కొనుగోలు శక్తిలో అమేరికా ప్రజలతో పోటీ పడుతున్నారు. అందువల్ల అమెరికా ప్రజ కొద్దిగా ఆర్థిక ఇబ్బందులకు లోనవుతోంది. దీంతో అమేరికా అధ్యక్ష ఎన్నికలలో ఆర్థిక పరిస్థితే కీలకమవబోతున్నది. ఇక అక్కడి ప్రభుత్వాలు ఇలాంటి సమస్యలకు బయట వేరెవరో కారణమని ప్రజలను నమ్మించటం అలవాటు చేసుకున్నాయి. ఆ ప్రయత్నంలో భాగమే ఈ వ్యాఖ్యలు. సంప్రదాయక వోట్లను పునాదిగా చేసుకున్న పార్టీకి చెందిన బుష్షయ్య మరెలా మాట్లాడతారనుకోగలం? అసలు ’భారతదేశపు మధ్యతరగతి ప్రజల సంఖ్య అమెరికా జనాభాకంటే ఎక్కువ’ అనటమే తమకు చెందాల్సిన ఆహారాన్ని వేరెవరో స్వంతం చేసుకున్నారన్న దురభిప్రాయాన్ని ప్రజలకు కలిగించటం కాదా? కొంపదీసి వారి ఆహారాన్ని మేము తిన్నామని రేపు దాడి చేయరు కదా? అసలు వారి అంతర్గత వైఫల్యాలకు వేరే దేశాలను బాధ్యులను చేసి దాడి చేయటమే వారి విదేశాంగ విధానం కదా.